వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. సోమవారం వీవీఐటీ కాలేజీ విద్యార్థుల సమక్షంలో ‘సరదా సరదాగా’ అనే రెండో గీతాన్ని విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించారు.
అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మనసుకు హత్తుకునే మెలోడీగా ఈ పాట సాగింది. తల్లిదండ్రులకు తమ కూతురిపై ఉండే అనుబంధాన్ని తెలియజెపుతూ ఈ పాట హృద్యంగా సాగింది. బాధ్యత, ప్రేమాభిమానాల కలిగిన తండ్రిగా వెంకటేష్ పాత్రను చూపించిన విధానం ఆకట్టుకుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.