తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, సారా తదితరులు
సినిమాటోగ్రఫీ: యస్.మణికందన్
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం: శైలేష్ కొలను
సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో వెంకటేష్. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాభిమానం సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన 75వ చిత్రం ‘సైంధవ్’. హిట్, హిట్-2 చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథ గురించి..
సైంధవ్ (వెంకటేష్) చంద్రప్రస్థ అనే పోర్ట్లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. కూతురు గాయత్రి (బేబీ సారా) అంటే పంచప్రాణాలు. భర్తకు దూరంగా ఉంటున్న మరో మనో (శ్రద్ధా శ్రీనాథ్) అనే మహిళతో సైంధవ్ సాన్నిహిత్యం పెంచుకుంటాడు. చిన్నారి గాయత్రి అనుకోకుండా స్పైనల్ మస్క్యులర్ అట్రోపి అనే ఆరుదైన వ్యాధి బారిన పడుతుంది. దానిని నయం చేయడానికి 17కోట్ల ఖరీదైన ఇంజక్షన్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో సైంధవ్ అలియాస్ సైకో ఏం చేశాడు? పిల్లల అక్రమ రవాణా చేస్తున్న వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధీఖీ)తో సైంధవ్ ఎలాంటి పోరాటం చేశాడు? చివరకు తన కూతురిని రక్షించుకోగలిగాడా? లేదా? అన్నదే ఈ సినిమా కథ..
కథా విశ్లేషణ
చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీ నేపథ్యంలో తండ్రీకూతురు అనుబంధం ప్రధానంగా..యాక్షన్, మాఫియా అంశాలతో దర్శకుడు ఈ కథను నడిపించారు. థ్రిల్లర్ చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శైలేష్ కొలను డాటర్ సెంటిమెంట్ చుట్టూ ఆయన ఈ థ్రిల్లర్ కథాంశాన్ని నడిపించాడు. పిల్లల అక్రమ రవాణా చేసే ఓ ప్రమాదకరమైన గ్యాంగ్, వారితో పోరాటం చేసే తండ్రి, ఎవరికీ తెలియని అతని ఫ్యాష్బ్యాక్..ఇలా ఓ ఫార్ములా కథతో ఈ సినిమాను తీర్చిదిద్దారు. అయితే గత చిత్రాల మాదిరిగా దర్శకుడు శైలేష్ కొలను తనదైన మార్క్ను ప్రదర్శించలేకపోయారు. ఎక్కడా ఉత్కంఠభరితమైన న మలుపులు లేకుండా కథ, కథనాలు సాగాయి. ముఖ్యంగా కథలో భావోద్వేగాలు అంతగా పండలేదు. పదిహేడు కోట్ల ఇంజెక్షన్ అనే పాయింట్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అల్లుకున్న సన్నివేశాలు కూడా ఆసక్తికరంగానే సాగాయి. ఎమోషన్స్ను పక్కనబెట్టి యాక్షన్ అంశాలతో కథను నడిపించడం మైనస్గా అనిపిస్తుంది. ఇటీవలకాలంలో ఫ్యామిలీ కథాంశాలను కూడా ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి చెప్పడం ట్రెండ్గా మారింది. ఈ సినిమా విషయంలో కూడా దర్శకుడు శైలేష్ కొలను అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. ప్రథమార్థంలో కథ, కథనాలు కాస్త ఆసక్తిగా అనిపించినా..ద్వితీయార్థంలో కథ ఎక్కడో గాడి తప్పిన భావన కలుగుతుంది. ైక్లెమాక్స్ ఘట్టాలు కూడా అంతగా మెప్పించవు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
సైంధవ్ అలియాస్ సైకో పాత్రలో వెంకటేష్ తనదైన ఫర్ఫార్మెన్స్తో మెప్పించాడు. ఈ తరహా యాక్షన్, ఎమోషన్ క్యారెక్టర్స్లో వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు శైలేష్ కొలను..వెంకటేష్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఆయన లుక్స్ ైస్టెలిష్గా ఉన్నాయి. నవాజుద్దీన్ సిద్ధీఖీ తనదైన విలనీ పండించారు. ఆయన క్యారెక్టర్ను డిజైన్ చేసిన విధానం బాగుంది. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ, ముఖేష్ రుషి, జయప్రకాష్ పరిధుల మేరకు నటించారు. ఇక సాంకేతికంగా కూడా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంద్రప్రస్థ నేపథ్యాన్ని సినిమాటోగ్రాఫర్ మణికందన్ చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదు. అయితే దర్శకుడు ఈ కథపై మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేదనే భావన కలుగుతుంది
ప్లస్ పాయింట్స్
వెంకటేష్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్
ఉన్నతమైన సాంకేతిక, నిర్మాణ విలువలు
నవాజుద్దీన్ సిద్ధీఖీ క్యారెక్టర్
మైనస్ పాయింట్స్
కథలో ఎమోషన్స్ మిస్కావడం
ఆకట్టుకోని ద్వితీయార్థం
రేటింగ్: 2.5/5