ఏ ఎమోషనైనా అద్భుతంగా పలికించగల అరుదైన నటుల్లో వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. ఎఫ్-3, ‘ఓరి దేవుడా’ సినిమాలతో ప్రేక్షకులకు కామెడీని పంచిన ఆయన.. తన రాబోవు సినిమా ‘సైంధవ్’తో మనసుల్ని కదిలించే ఉద్వేగానికి తెరలేపనున్నారు. కథా పరంగా ఇదో ఓ ఫ్యామిలీ థ్రిల్లర్ అని తెలుస్తున్నది.
గతంలో వెంకటేష్ చేసిన ‘దృశ్యం’ మాదిరిగానే ఉత్కంఠకు గురిచేసే ఎమోషనల్ డ్రామాగా ‘సైంధవ్’ ఉంటుందని సమాచారం. ఇందులో పగతో రగిలిపోయే పాత్రను వెంకటేశ్ పోషిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. రుహానీ శర్మ ఇందులో కథానాయిక. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది.