Sai Srinivas | టాలీవుడ్లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బుధవారం రాత్రి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో, శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కావ్య రెడ్డితో ఆయన వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుక సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్త పద్ధతిలో నిర్వహించబడింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ కార్యక్రమం చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది.
పెళ్లి వేడుకలో వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ శుభకార్యానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు కూడా ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కొత్త దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జీవితంలో సుఖశాంతులు కలగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే, పెళ్లి అనంతరం కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినిమా ప్రాజెక్ట్లపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన ఈ హీరో, కెరీర్లో కూడా మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.