భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ మరోమారు వెండితెర దృశ్యమానం కాబోతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి నటించనున్నారు. మూడు భాగాలుగా భారీ వ్యయంతో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న అధికారికంగా ప్రకటిస్తారని వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందానికి సంబంధించి కొన్ని అంతర్గత సమస్యల కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని, ఈ ఏడాది పట్టాలెక్కేది అనుమానమేనని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. కొన్ని సృజనాత్మక విభేదాలతో పాటు సాంకేతిక అంశాల విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో తొలుత వాటిని పరిష్కరించుకునే దిశగా చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నదని తెలిసింది. అయితే ఈ వార్తల్లో నిజాలేమిటో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ సినిమాలో వివిధ భాషల అగ్ర నటులు భాగం కాబోతున్నారు. రావణాసురుడి పాత్రలో కన్నడ అగ్ర నటుడు యష్ నటించనున్నారని వార్తలొచ్చాయి. తాజా వదంతుల నేపథ్యంలో ఈ సినిమా సెట్స్మీదకు రావడం మరింత ఆలస్యం కావొచ్చని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.