1990 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘విరాట పర్వం’. రానా, సాయిపల్లవి జంటగా నటించారు. వేణు ఊడుగుల దర్శకుడు. డి.సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో రానా తుపాకీ గురిపెట్టి చూస్తుండగా, ఆయన్ని అనుసరిస్తూ సాయిపల్లవి కనిపిస్తున్నది. ‘తెలుగునేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం..మనలోంచి మనకోసం సాగిన ఓ చారిత్రక సందర్భం..ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం’ అంటూ ఈ పోస్టర్ గురించి దర్శకుడు వేణు ఊడుగుల సోషల్మీడియా ద్వారా స్పందించారు. ఈ సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటించారు. నక్సలిజం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రియమణి, నందితాదాస్, నవీన్చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల.