గత నెలలో జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువహీరో సాయిధరమ్తేజ్ క్రమంగా కోలుకుంటున్నారు. యాక్సిడెంట్ ఆనంతరం కొద్దిరోజుల పాటు కోమాలోకి వెళ్లారాయన. భుజానికి నిర్వహించిన శస్త్ర చికిత్స కూడా విజయవంతమైంది. మరికొద్దిరోజుల్లో ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని తెలిసింది. కాగా సాయిధరమ్తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం ఇటీవలే విడుదలై విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఆదివారం ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు సాయిధరమ్తేజ్. ‘మీరందరు నాపై చూపించిన ప్రేమాభిమానాలను వ్యక్తపరచడానికి మాటలు చాలడం లేదు. కృతజ్ఞత అనేది చాలా చిన్నపదంలా అనిపిస్తున్నది. త్వరలో మిమ్మల్ని కలుస్తా’ అని సాయిధరమ్తేజ్ పేర్కొన్నారు. ప్రమాద అనంతరం ఆయన తొలిసారి చేసిన ట్వీట్తో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయిధరమ్తేజ్ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు.