‘మూడేళ్ల క్రితం ఈ కథ విన్నాను. సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే అనుకున్నా. కథలో యూనివర్సల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు సాయిధరమ్తేజ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంయుక్తమీనన్ కథానాయిక. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం సినిమాలోని పాత్రల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాయిధరమ్తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు కార్తీక్ అద్భుతంగా తెరకెక్కించాడు. ‘విరూపాక్ష’ ప్రపంచాన్ని కళ్లముందుంచాడు. సాంకేతికంగా అన్ని విభాగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దారు. నాకు సెట్లో ఆరోగ్యం బాగా లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో మా నిర్మాతలకు రుణపడి ఉంటాను.
ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్కు కృతజ్ఞతలు. ఈ మిస్టిక్ స్టోరీ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అన్నారు. తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి సాయిధరమ్తేజ్ స్పందించారు. ‘ఆ యాక్సిడెంట్ సంగతే మర్చిపోయాను. దాన్నొక స్వీట్ మెమొరీలా దాచి పెట్టుకున్నా. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నా. ఇక మీద గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తా’ అని చెప్పారు.
“రంగస్థలం’ షూటింగ్ టైంలో సుకుమార్గారికి ఈ కథ చెప్పాను. కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. సాయిధరమ్తేజ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంటుంది ’ అని దర్శకుడు తెలిపారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఇది యూనివర్సల్ కథాంశం. అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సినిమాలో తాను నందిని అనే పాత్రను పోషించానని కథానాయిక సంయుక్త మీనన్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ, శ్యామల, అభినవ్, అజయ్, కెమెరామెన్ శ్యాందత్ తదితరులు పాల్గొన్నారు