Sai Dharam Tej | ఇండస్ట్రీలో ప్రతీ హీరోకు మాస్ ఫాలోయింగ్ ఉండాలని ఎంతో ఆరాటపడుతుంటారు. ఎందుకంటే ఎంత కంటెంట్ సినిమాలు చేసిన మాస్ ఆడియెన్స్ సపోర్ట్ లేకపోతే అవి కమర్షియల్గా భారీ విజయాలు సాధించలేకపోతాయి. అంతేకాకుండా మాస్ సినిమాలే హీరోలను స్టార్లను చేస్తాయి. దశాబ్దాల సినిమా చరిత్రను చూసుకున్న మాస్ సినిమాలే హీరోలను స్టార్లను చేశాయి. కాగా తొమ్మిదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న కమర్షియల్ హీరో స్టేటస్ తెచ్చుకోలేకపోతున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. మాస్ కటౌట్, మంచి డైలాగ్ టైమింగ్, యాక్షన్ కూడా ఇరగదీస్తాడు అయినా కానీ మాస్ హీరో స్టేటస్ దక్కించుకోలేకపోయాడు ఈ మెగా మేనల్లుడు.
‘రేయ్’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చినా.. మొదటి సారి స్క్రీన్పై కనిపించింది మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’తోనే. తొలి సినిమాతోనే రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తేజ్ తిరుగులేని విజయాన్నందుకున్నాడు. ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పట్లో తేజ్ స్పీడ్ చూసి.. చిరు, పవన్ తర్వాత మెగా ఫ్యామిలీలో ఆ స్థాయి నటుడు తేజ్ అవుతాడని అందరూ భావించారు. కట్ చేస్తే వరుసగా ఆరు ఫ్లాపులు. అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. ఇక నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘చిత్రలహరి’తో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే ‘ప్రతి రోజు పండగే’ కమర్షియల్గా తేజ్కు మంచి బ్రేక్ ఇచ్చింది.
ఈ సినిమా తర్వాత ‘సోలో బ్రతుకే’ సినిమాతో సో సో మార్కులు వేయించుకున్న తేజ్.. ‘రిపబ్లిక్’తో గొప్ప ప్రశంసలు పొందాడు. కమర్షియల్గా ఈ సినిమా సేఫ్ కాలేకపోయినా.. తేజ్కు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష అనే మిస్టరీ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. కార్తిక్ దండూ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా మరో 24గంటల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలే పెంచాయి.
ఇక ఈ సినిమా తర్వాత తేజ్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కాగా తాజాగా తేజ్ తన నెక్స్ట్ సినిమా యాక్షన్ జానర్లో ఉండాలనుకుంటున్నాడట. ఈ క్రమంలో మాస్కు నిర్వచనమైన సంపత్ నందితో సంప్రదింపులు జరుపుతున్నాడట. ‘ఏమైంది ఈ వేళ’ వంటి కమింజ్ ఏజ్ లవ్స్టోరీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. రచ్చ, బెంగాల్ టైగర్ వంటి మాస్ సినిమాలే సంపత్ నందికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రెండేళ్ల క్రితం వచ్చిన ‘సీటిమార్’ వంటి స్పోర్ట్స్ డ్రామాలో సైతం మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి.
దాంతో తేజ్ దృష్టి ఇప్పుడు సంపత్ నందిపై పడింది. మార్కెట్లో తనను సరైన మాస్ హీరోగా చూపించాలంటే సంపత్ నందినే కరెక్ట్ అని భావించి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని సమాచారం. ప్రస్తుతం మంచి స్పీడ్లో ఉన్న సితారా సంస్థ ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం తేజ్.. పవన్ కళ్యాణ్తో కలిసి వినోదయ సిత్తం రీమేక్ చేస్తున్నాడు.