హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ని నిర్ణయించారు. బుధవారం ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రచార చిత్రానికి స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణంలో బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి సుకుమార్ లాంటి గొప్ప దర్శకుడు స్క్రీన్ప్లే అందించడం, నిర్మాణ భాగస్వామిగా వుండటం ఎంతో సంతోషంగా వుంది. ఈ చిత్ర నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది’ అన్నారు. దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ ‘1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
సుకుమార్ గారు ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో కొత్త సాయిధరమ్ తేజ్ను చూస్తారు.’ అన్నారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ శ్యామ్ దత్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సతీష్ బీకేఆర్, అశోక్ బండ్రెడ్డి, సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్, నటీనటులు, శ్యామల, సోనియా, కమలాకర్, రవి తదితరులు పాల్గొన్నారు. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 21న విడుదల కానుంది.