ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్నారు మెగా హీరో సాయిదుర్గతేజ్. ఈ క్రమంలోనే తర్వాత చేయబోయే సినిమాకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారాయన. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్సిరీస్ ఫేం తేజ కాకుమాను దర్శకత్వంలో ఆయన త్వరలో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘పార్వేట’ అనే టైటిల్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. నృసింహక్షేత్రాల్లో పార్వేట అనేది ప్రతీ ఏటా జరిగే ఉత్సవం. ఈ ఉత్సవానికి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంది.
అలాంటి పేరును ఈ సినిమాకు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అటవీ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్ ఎఫెక్ట్స్కు పెద్ద పీట వేయనున్నట్టు తెలిసింది. అక్టోబర్ నుంచి సెట్స్కి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సివుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.