‘సినిమాకు ఎమోషన్సే ప్రాణం. కథకీ, కథలోని ఎమోషన్స్కీ ఆడియన్ కనెక్టయితే.. ఆ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ కథకు ఉన్న బలం కూడా అదే. ఇది తల్లీకూతుళ్ల కథ. ఎంత బాగా చెబితే, అంతబాగా కనెక్టయ్యే పాయింట్.’ అన్నారు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల. ఆయన నిర్మించిన చిత్రం ‘శబరి’. వరలక్ష్మీ శరత్కుమార్ టైటిల్రోల్ చేశారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు మహేంద్రనాథ్. ‘నిర్మాత గురించి ఆలోచించే గొప్ప సంస్కారం ఉన్న వరలక్ష్మీ శరత్కుమార్ నా తొలి చిత్ర కథానాయిక కావడం ఆనందంగా ఉంది. ఈ కథను నాకంటే ముందు ఆమే ఓకే చేశారు. ఆమె అభిరుచిపై నాకున్న నమ్మకం నన్ను నిర్మాతను చేసింది’ అని చెప్పారు మహేంద్రనాథ్. అమెరికాలో ఉద్యోగంలో చేరిన వారానికే వ్యాపారం మొదలుపెట్టాననీ, సినిమా చేయాలి అనుకున్నప్పుడు 5 భాషల్లో చేద్దామంటే ఓకే చెప్పాననీ, రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో ఎదగలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో కథలో భాగంగానే ఎమోషన్సూ యాక్షన్ సీక్వెన్సూ ఉంటాయని, వరలక్ష్మీ ఎంతో కష్టపడి నటించారని ఆయన చెప్పారు. వరుణ్సందేశ్ హీరోగా తన రెండో సినిమా, బిగ్బాస్ అమర్దీప్, సురేఖవాణి కుమార్తె సుప్రీత జంటగా తన మూడో సినిమా ఉంటాయని మహేంద్రనాథ్ తెలిపారు.