తొలి తెలుగు ఓటీటీ ఆహా కోసం బాలకృష్ణ అన్స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో రికార్డులతో దూసుకుపోతోంది. ‘ఆహా’లో ఇప్పటివరకు మొదలయిన టాక్ షోలలో అన్స్టాపబుల్ సాధించినంత విజయం మరే టాక్ షో సాధించలేదు. ఈ షోలో కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు సందడి చేస్తూ మంచి వినోదం పంచుతున్నారు.
ఇప్పటి వరకు ఈ షోలో సినీ నటులు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించారు. రీసెంట్గా అఖండ చిత్ర బృందం కూడా ఈ షోలో పాల్గొని తెగ హడావిడి చేశారు. ఇక మహేష్ బాబు కూడా అన్స్టాపబుల్ షూటింగ్ పూర్తి చేశారు. రీసెంట్గా బాలయ్యతో దిగిన ఫొటో షేర్ చేసిన మహేష్ బాబు.. “నా సాయంత్రాన్ని ఎన్బీకే గారితో ‘అన్స్టాపబుల్’గా ఆనందించాను” అంటూ చెప్పుకొచ్చారు. అతి త్వరలో ఈ ఎపిసోడ్ ప్రారంభం కానుంది.
ఇక తర్వాతి ఎపిసోడ్ కోసం ఆర్ఆర్ఆర్ టీం బాలయ్య షోలో ప్రత్యక్షం అయింది. తాజాగా రాజమౌళి, కీరవాణి మాత్రమే షోలో పాల్గొన్నట్టు ఫొటోల ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా షోలో సందడి చేస్తే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ ఇద్దరు హీరోలు కూడా షోలో పాల్గొంటే ఆ సందడి వేరే రేంజ్లో ఉండడం ఖాయం. భారీ బడ్జెట్తో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.