కొత్త ఏడాది ఆరంభంలో సినీప్రియులకు నిజంగా ఇది చేదువార్తే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమాను వాయిదా వేస్తున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల, తెలుగేతర రాష్ర్టాల్లో థియేటర్ల ప్రదర్శన విషయంలో ఆంక్షలు, కొన్ని రాష్ర్టాల్లో రాత్రి కర్యూ నిబంధన అమల్లో ఉండటంతో సినిమా విడుదల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ బృందం పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది.
సరైన సమయంలో విడుదల చేస్తాం
‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘సినిమా విడుదల కోసం చాలా ప్రయత్నాలు చేశాం. కొన్ని పరిస్థితులు మా ఆధీనంలో లేకుండా పోయాయి. కరోనా వల్ల చాలా రాష్ర్టాల్లో థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. సరైన సమయంలో చిత్రాన్ని తిరిగి ప్రేక్షకులముందుకు తీసుకొస్తాం’ అని ట్విట్టర్లో ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.