హైదరాబాద్: భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్పై డౌట్ నెలకొన్నది. వాస్తవానికి ఈ ఫిల్మ్ను ఈనెల ఏడో తేదీన రిలీజ్ చేయాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, ఒమిక్రాన్ వేరియంట్ కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో.. అనేక రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో సినిమా థియేటర్లను కేవలం 50 శాతం కెపాసిటీతో నడిపిస్తున్నారు. అక్కడ ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉంది. ఢిల్లీలో కూడా థియేటర్లపై 50 శాతం కెపాసిటీ కండీషన్ ఉంది. అక్కడ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మరికొన్ని వారాల పాటు ప్రమాదం పొంచి ఉందని ఇటీవల ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరలపై వివాదం నెలకొన్న సందర్భంగా కూడా ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన తుది ప్రకటన మరికాసేపట్లో వెలుబడనున్నది.