‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. అంజి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయికుమార్ నిర్మిస్తున్నారు. అనన్య కథానాయికగా నటిస్తున్నది. హీరో రాకింగ్ రాకేష్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎంపీ సంతోష్కుమార్ క్లాప్నివ్వగా, ఏపీ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విఛాన్ చేశారు. తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ ‘రాకేష్ గొప్ప నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’ అన్నారు. రాకేష్ చక్కటి ప్రతిభావంతుడని, ఇండస్ట్రీలో అతని మంచి భవిష్యత్తు ఉందని తనికెళ్ల భరణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం: కాసర్ల శ్యామ్, ఆర్ట్: బత్తుల మహేష్, కెమెరా, దర్శకత్వం: గరుడవేగ అంజి.