Robinhood | నటుడు నితిన్ (Nithiin)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్హుడ్ (Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాబిన్ హుడ్ సినిమాకు ఏపీలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ఈ చిత్రం మార్చి 28, 2025న విడుదల కానున్న నేపథ్యంలో మొదటివారం రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఇక పెరిగిన ధరలను బట్టి చూసుకుంటే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 50 అదనంగా పెరుగుతుండగా.. మల్టీప్లెక్స్లలో రూ. 75 అదనంగా పెరుగనుంది. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. అధిక ధరల వలన సినిమా బాగున్న కూడా చూడమంటూ కామెంట్లు పెడుతున్నారు.