‘జెట్లీ’ చిత్రాన్ని ఎనభైశాతం వరకు ఫ్లైట్లోనే చిత్రీకరించామని, తెలుగులో ఇదొక సరికొత్త ప్రయోగమని, హాస్యం కలబోసిన థ్రిల్లర్ కథగా ఆకట్టుకుంటుందని చెప్పారు చిత్ర దర్శకుడు రితేష్ రానా. ఆయన నిర్ధేశకత్వంలో సత్య, రియా సింఘా జంటగా నటించిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం దర్శకుడు రితేష్ రానా విలేకరులతో ముచ్చటించారు. సత్య పాత్ర.. కామెడీ, సీరియస్నెస్, సస్పెన్స్ కలబోతగా సాగుతుందని, దుబాయ్ నుంచి కొచ్చికి విమాన ప్రయాణంలో జరిగే కథ ఇదని, ఈ వేసవిలో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా అలరిస్తుందని చెప్పారు.
‘ఈ సినిమా కోసం బిజినెస్ క్లాస్, కార్గో, కాక్పిట్.. ఇలా విమానంలో విభాగాల్ని చూపించే ఐదు భారీ సెట్స్ వేశాం. మెజారిటీ షూటింగ్ వాటిలోనే చేశాం. ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆయన సినిమా అంతా సుడోకు ఆడుతూ కనిపిస్తారు. చాలా టిపికల్ క్యారెక్టర్’ అన్నారు. పంచ్లు, వ్యంగ్యం కలబోసిన కామెడీని తాను బాగా ఇష్టపడతానని, క్రేజీ మోహన్ కామెడీ ైస్టెల్ బాగా ఇష్టమని రితేష్ రానా తెలిపారు. తన తర్వాతి సినిమా అంతా కొత్తవాళ్లతో హారర్ జోనర్లో ఉంటుందని అన్నారు.