కమర్షియల్ పంథాకు భిన్నంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని ఎంచుకుంటూ సినీప్రయాణాన్ని కొనసాగిస్తున్నది లావణ్య త్రిపాఠి. తాజాగా ఆమె కామెడీ థ్రిల్లర్ చిత్రంలో నటించబోతున్నది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి రితేష్ రానా(‘మత్తు వదలరా’ ఫేమ్) దర్శకుడు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్నివ్వగా, గుణ్ణం గంగరాజు కెమెరా స్విఛాన్ చేశారు. కొరటాల శివ గౌరవ దర్శకత్వం వహించారు. ‘వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ చిత్రమిది’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబా సాయికుమార్.