‘ఈ కథ 80శాతం ఫ్లైట్లోనే జరుగుతుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదో కొత్త ప్రయోగం. రితేష్ ఈ కథ చెప్పగానే నచ్చింది. అందుకే మరో ఆలోచన చేయకుండా ముందుకెళ్లాను’ అన్నారు నిర్మాత చిరంజీవి(చెర్రీ). కమెడియన్ సత్య కథానాయకుడిగా రితేష్ రానా దర్శకత్వంలో హేమలత పెద్దమల్లుతో కలిసి ఆయన నిర్మించిన కామెడీ థ్రిల్లర్ ‘జెట్లీ’. మే 1న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘మొదట ఈ సినిమాను సీరియస్ థ్రిల్లర్గా చేయాలనుకున్నాం. కథ కూడా డెవలప్ చేశాం. కానీ ఏ హీరోకీ ఈ కథ సెట్ అయ్యేలా కనిపించలేదు. ఎందుకంటే ఇది రెగ్యులర్ హీరో కథ కాదు. అందుకే రితేష్ దీన్ని కామెడీ థ్రిల్లర్గా మార్చి రాశాడు.
సత్యకు ఈ కథ చెప్పినప్పడు, ‘కథ బావుంది కానీ.. నేను హీరో ఏంటి?’ అన్నాడు. రితేష్ వివరంగా చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు. ఈ కథలో అందరికీ సమప్రాధాన్యత ఉంటుంది. యాక్షన్ కూడా సినిమాటిక్ లిబర్టీతో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. రితేష్ తొలి సినిమా నుంచీ టెక్నీషియన్స్ మారలేదు. వారంతా ప్రాణంపెట్టి పనిచేశారు. ఫైనల్ అవుట్ పుట్ చూశాను. కచ్ఛితంగా అందరికీ నచ్చే కామెడీ థ్రిల్లర్ అవుతుంది’ అని తెలిపారు. దేశంలోని ప్రతిష్టాత్మత చిత్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీమూవీమేకర్స్లో ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకోవడం గర్వంగా ఉందని, త్వరలో రితేష్తో ఓ హారర్ సినిమా చేయబోతున్నామని, ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని చెర్రీ చెప్పారు.