Ritesh – Genelia | బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ “రాజా శివాజీ” తాజాగా ట్రైలర్ లాంచ్తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టిన రితేష్, తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్గా దీన్ని భావిస్తున్నారు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ముంబైలో ఘనంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో రితేష్ దేశ్ముఖ్ తన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ముఖ్ను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి ఆశయాలు, ఆశీస్సులు ఈ సినిమాతో నెరవేరుతున్నాయని చెప్పుకుంటూ ఆయన కంటతడి పెట్టడం అక్కడి అందరినీ కదిలించింది.
భర్త భావోద్వేగానికి గురవ్వడంతో ఆయన పక్కనే ఉన్న జెనీలియా కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అనంతరం మాట్లాడిన జెనీలియా, ఈ సినిమా కోసం రితేష్ ఎంతో కష్టపడ్డాడు. అతను ఎంతగా ఈ ప్రాజెక్ట్లో మునిగిపోయాడో నేను దగ్గర నుంచి చూశాను అంటూ భావోద్వేగంతో స్పందించింది. ఈ క్షణాలను చూసి స్టేజిపై ఉన్న ప్రముఖ నటుడు సంజయ్ దత్తో పాటు అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజా శివాజీ సినిమాలో రితేష్ దేశ్ముఖ్తో పాటు జెనీలియా, సంజయ్ దత్, విద్యా బాలన్, అభిషేక్ బచ్చన్, భాగ్యశ్రీ వంటి బాలీవుడ్ ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మరాఠీ, హిందీతో పాటు తెలుగు భాషల్లో కూడా మే 1న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, ఆయన పరాక్రమం, నాయకత్వం, సామ్రాజ్య నిర్మాణం వంటి అంశాలపై ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్తో భారీ అంచనాలు రేకెత్తించింది. భావోద్వేగంతో నిండిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ “రాజా శివాజీ”పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.