పానిండియా బ్లాక్బస్టర్ ‘హను-మాన్’కి సీక్వెల్ అంటూ ‘జై హనుమాన్’ని ప్రకటించి, హనుమంతుడిగా రిషబ్శెట్టి స్టిల్స్ విడుదల చేసిన నాటినుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు అంబరాన్ని తాకాయి. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సగటు ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారందరి ఎదురు చూపులకు తెరదించుతూ ఆదివారం ఆంజనేయుడి జన్మస్థలంగా విశ్వసింపబడే విజయనగరం హంపిలోని అంజనాద్రి బెట్టలో ‘జై హనుమాన్’ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ అధినేత భూషణ్కుమార్ క్లాప్ కొట్టగా, అనిల్ థడానీ కెమెరా స్విచాన్ చేశారు. ‘హను-మాన్’ చిత్ర కథానాయకుడు తేజ సజ్జా తొలి షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. అనిల్ థడాని, భూషణ్కుమార్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి చిత్ర దర్శకుడు ప్రశాంత్వర్మకు స్క్రిప్ట్ను అందించారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని దర్శకుడు ప్రశాంత్వర్మ తెలిపారు. ‘కాంతార చాప్టర్ 1’తో దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న రిషబ్శెట్టి ఈ చిత్రంలో ఆంజనేయుడిగా నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని, పూర్తిగా హనుమంతుడి నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని, ఊహించని విధంగా కథ,కథనాలు సాగుతాయని, మొత్తంగా ఇదొక సెల్యులాయిడ్ వండర్ అనీ మేకర్స్ చెబుతున్నారు. ‘హనుమంతుడి మౌనం ఓటమి కాదు.. ఒక లక్ష్యంతో కూడిన నిశ్చలత. సమయం వచ్చినప్పుడు ఆ అపారశక్తి వెలుగులోకి వస్తుంది. అచంచల భక్తివిశ్వాసాలకు, శాశ్వత బలానికి నివాళి ఈ కథ’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: ఎస్.తిరునావుక్కరసు, నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్.