YS Jagan Mohan Reddy Biopic | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. వైఎస్ మరణం తర్వాత జగన్ జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాలను తెరకెక్కించాడు వర్మ. అయితే ఇందులో ‘వ్యూహం’ సినిమా నవంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించడంతో మూవీ వాయిదా పడింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గయ్స్’.. ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చింది. డిసెంబర్ 29న ‘వ్యూహం’ థియేటర్లలోకి రాబోతుంది అంటూ వర్మ రాసుకోచ్చాడు. దీనితో పాటు ‘వ్యూహం’ సినిమాకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను ఫొటో దిగి షేర్ చేశారు.
ఇక ఈ చిత్రంలో నటుడు అజ్మల్ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రను పోషించారు. వైఎస్ భారతి పాత్రను మానస రామకృష్ణ పోషించారు. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.