19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నది రేణూ దేశాయ్. ఆమె చివరిసారి తెరపై కనిపించిన సినిమా ‘జానీ’. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆమె టాలీవుడ్లోకి పునరాగమనం చేస్తున్నది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సామాజిక ఉద్యమకారిని హేమలత లవణం పాత్రలో కనిపించబోతున్నది రేణూ దేశాయ్. ‘సంస్కార్’ అనే ఉద్యమం ద్వారా కరుడు గట్టిన నేరస్థులు, దొంగల్లో పరివర్తన తెచ్చే దిశగా ప్రయత్నాలు జరిగాయి. స్టువర్టుపురం నేరస్థులు జనజీవనంలో కలిసేలా ఉద్యమాన్ని నడిపారు హేమలత. ప్రభుత్వంతో మాట్లాడి దొంగలకు, వారి కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఈ కీలక పాత్రలో రేణూ దేశాయ్ నటిస్తున్నది. ఇలాంటి స్ఫూర్తికర పాత్రలో నటించే అవకాశం రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిందామె.