Renu Desai | సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, అసభ్యకర వ్యాఖ్యలపై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. అకారణంగా బూతులు తిట్టే నెటిజన్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేస్తూ, చట్టపరమైన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో పలువురిని అరెస్ట్ చేయించిన ఆమె, తాజాగా మరోసారి వీడియో ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.గతంలోనే సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన రేణూ దేశాయ్, చెప్పినట్లుగానే చర్యలకు దిగారు. తనపై దూషణలు చేసిన పలువురు నెటిజన్లపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పటికే ఆరుగురికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేశారు. “ఇక ఇది మొదట మాత్రమే.. ఇక్కడితో ఆగదు” అంటూ ఆమె స్పష్టం చేశారు.
పోలీసుల విచారణలో బయటపడిన విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొందరు కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనే సెలబ్రిటీలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని సమాచారం. దీనిపై స్పందించిన రేణు దేశాయ్, తాత్కాలిక ఫేమ్ కోసం జీవితాంతం మచ్చ తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించారు. అసభ్యకరంగా ప్రవర్తించే వారి వివరాలను బయటపెట్టకపోయినా, వారి ఉద్యోగ స్థలాలకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని రేణు దేశాయ్ హెచ్చరించారు. “ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే బూతులు తిట్టడం కాదు. ఇలాంటి చర్యలు మీ కెరీర్ను నాశనం చేస్తాయి” అని స్పష్టం చేశారు.
ఈ కేసులో వేగంగా స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులను రేణు దేశాయ్ అభినందించారు. “సిస్టమ్ మీద మళ్లీ నమ్మకం పెరిగింది” అని తెలిపారు. ఇకపై ఎవరైనా ఇలాంటి దూషణలకు పాల్పడితే తప్పకుండా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే ముందు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాలని రేణు దేశాయ్ కోరారు. నచ్చని విషయాన్ని కూడా మర్యాదపూర్వకంగా చెప్పవచ్చని, కానీ అసభ్యకర వ్యాఖ్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆమె తేల్చి చెప్పారు.