కథాంశాల ఎంపికలో తన పంథా మార్చుకున్నానని చెప్పింది చెన్నై సొగసరి రెజీనా. నవ్యమైన ఇతివృత్తాలతో పాటు పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే సినిమాల్ని అంగీకరిస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం భారతీయ సినిమాల్లో మహిళల కోసం చాలెంజింగ్ రోల్స్ను సృష్టిస్తున్నారని…నటిగా ప్రతిభాకౌశలాల్ని చాటుకోవడానికి ఇదే సరైన సమయమని తెలిపింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రాకెట్ బాయ్స్’ వెబ్సిరీస్లో నటిస్తున్నది. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన విక్రం సారాభాయ్ జీవిత కథ ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయన భార్య మృణాళిని సారాభాయ్గా రెజీనా నటిస్తున్నది. భారతీయ సంప్రదాయ నృత్యంలో పేరుప్రఖ్యాతులు కలిగిన మృణాళిని పాత్రకోసం రెజీనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుందట. ముఖ్యంగా భరతనాట్యంలో పరిపూర్ణ ప్రదర్శన కోసం రెండు నెలలు వెచ్చించానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రముఖుల పాత్రలు పోషిస్తున్నప్పుడు సహజత్వం కనిపించాలి. అందుకే ముంబయి, జైపూర్లో భరతనాట్యం నేర్చుకున్నా. స్కూల్ రోజుల్లో నాకు అందులో మంచి ప్రావీణ్యం ఉండటంతో కొద్దిరోజుల్లోనే నాట్యంపై పట్టు సాధించా. ఈ పాత్ర నా కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ త్వరలో ఓటీటీలో విడుదలకానుంది.