పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పచ్చని ప్రకృతిని పెంచే కార్యక్రమంలో భాగమవుతున్నారు. మంగళవారం హీరోయిన్ రెజీనా కాసాండ్రా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా శిల్పారామం రాక్ పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆమెతో పాటు శాకిని డాకిని చిత్ర నిర్మాత తాటి సునీత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ.. ‘రాబోయే తరాలకు స్వచ్ఛమైన ఆక్సీజన్ అందించాలంటే పర్యావరణం బాగుండాలి. అందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు. ఇవాళ మాకు ఇష్టమైన పారిజాతం, వేప మొక్కలు నాటాం. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.’ అన్నారు. అనంతరం హీరోయిన్ నివేదా థామస్, హీరో శ్రీసింహా, సంగీత దర్శకుడు కాళ భైరవలకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరారు.