రెజీనా, నివేదా సతీష్, నరేష్ ఆగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్సీరిస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ను ‘ఆహా’ ఓటీటీలో విడుదల చేస్తారు. దర్శకురాలు మాట్లాడుతూ ‘అన్య అనే అమ్మాయి ఓ వెబ్ఛానెల్ను నడుపుతుంటుంది. ఇంట్లో ఆత్మలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు అనుహ్య పరిణామాలు ఎదురవుతాయి. ఆమె జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. దాని నుంచి ఆమె ఎలా బయటపడిందన్నదే ఈ సిరీస్ కథ’ అని చెప్పింది. ఈ సిరీస్కు దర్శకత్వం, రచనా బాధ్యతల్ని ఇద్దరు మహిళలే నిర్వర్తించడం సంతోషంగా ఉందని రెజీనా పేర్కొంది. శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు అందరం థ్రిల్గా ఫీలయ్యాం. ప్రేక్షకులు అదే అనుభూతికిలోనవుతారు. అక్టోబర్లో చిత్రీకరణ పూర్తిచేసి, క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.