తెలుగులో తొలి పాన్ఇండియా హీరో అనగానే ఠకీమని వచ్చే సమాధానం ప్రభాస్. అంతటి ఇమేజ్ తర్వాత ఎవరైనా జాగ్రత్తగా నింపాదిగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తారు. కానీ ప్రభాస్ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు ‘కల్కి 2898’, మరోవైపు ‘రాజాసాబ్’, ఇంకోవైపు ‘సలార్ సౌర్యాంగపర్వం’ సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్కి ఓకే చెప్పేశారు.
‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు ప్రభాస్. ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్నారు. సోమవారం వరంగల్ ఎన్ఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హను రాఘవపూడి ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ‘ప్రభాస్తో సినిమా చేయబోతున్నాను. చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఆ సినిమా ఉంటుంది. విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే ఈ సినిమాకోసం మూడు పాటలను కంపోజ్ చేశారు.’ అని తెలిపారు హను రాఘవపూడి.