కథానాయకుడు ఎంతటి ధీరోదాత్తుడైనా శత్రుసంహారం చేయాలంటే ఆయుధం పట్టాల్సిందే. కానీ కృష్ణంరాజు భృకుటి ముడిచి కన్నెర్ర చేస్తే చాలు వెండితెరపై అసురనాశనం చేసే ప్రళయ రుద్రుడి అవతారం సాక్షాత్కరిస్తుంది. ఆయన కోపంతో పిడికిలి బిగిస్తే థియేటర్లు హోరెత్తిపోయేవి. రౌద్రరసపూరిత అభినయానికి చిరునామాగా నిలిచిన కృష్ణంరాజు రెబల్ స్టార్ అనే పేరును సార్థకం చేసుకున్నారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రల్లో, అనితరసాధ్యమైన నటనతో ఓ చరిత్రను లిఖించుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలో అజాతశత్రువుగా, సౌమ్యుడిగా, ఉదారస్వభావిగా అందరి మన్ననలు అందుకున్నారు. రెబల్స్టార్ కృష్ణంరాజు మరణంతో తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ముగిసిపోయినట్లయింది. ఆదివారం తెల్లవారుఝామున అనారోగ్యంతో కృష్ణంరాజు మరణించాడన్న విషయం తెలుగు సినీ ప్రియులను విషాదంలో ముంచెత్తింది. నేటి మధ్యాహ్నం మొయినాబాద్ దగ్గరలోని కనకమామిడి ఫామ్హౌస్లో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కృష్ణంరాజు స్వస్థలం. 1940 జనవరి 20న జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1966లో ‘చిలకా గోరింక’ సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంతో విలన్గా మారారు. అందమైన ప్రతినాయకుడి వేషంలో కనిపించి ఆకట్టుకున్నారు. క్రమంగా కథలో ప్రాధాన్యమున్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ వచ్చారు…అలా ‘భలే అబ్బాయిలు’, ‘భలే మాస్టారు’, ‘బుద్ధి మంతుడు’, ‘మనుష్యులు మారాలి’, ‘భాగ్యవంతుడు’, ‘మానవుడు దానవుడు’, ‘బడి పంతులు’, ‘ఊరికి ఉపకారి’, ‘అనగనగా ఓ తండ్రి’ వంటి సినిమాలు చేశారు.
తన సొంత సంస్థ గోపీకృష్ణా మూవీస్లో నటించిన ‘కృష్ణవేణి’ సినిమా ఆయన కెరీర్కు ఘన విజయాన్ని అందించింది. ‘భక్త కన్నప్ప’, ‘కటకటాల రుద్రయ్య’, ‘అమరదీపం’, ‘త్రిశూలం’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘రంగూన్ రౌడీ’, ‘వినాయక విజయం’ ‘చండీ’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘రుద్రమదేవి’ వంటి విభిన్న తరహా చిత్రాల్లో నటించారు కృష్ణంరాజు. ఆయన నటించిన చివరి సినిమా ‘రాధే శ్యామ్’. ఈ చిత్రంలో పరమహంస అనే క్యారెక్టర్లో కనిపించారు. ఐదు దశాబ్దాల కెరీర్లో 180కి పైగా చిత్రాల్లో నటించారు.
హైదరాబాద్లో జర్నలిస్ట్గా ప్రస్థానం
14 ఏళ్ల వయసులోనే ఫొటోగ్రఫీపై అభిరుచితో హైదరాబాద్కు వచ్చి అబిడ్స్లో ‘రాయల్ స్టూడియో’ పేరుతో ఓ ఫొటోస్టూడియోను కూడా నడిపారు కృష్ణంరాజు. ఓ వైపు స్టూడియో నడిపిస్తూనే భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్లో విద్యార్థిగా చేరారు. అక్కడే బీకాం పూర్తి చేశారు. బీకాం థర్డ్ ఇయర్లో ఉండగా ‘ఆంధ్రరత్న’ దినపత్రికలో జర్నలిస్ట్గా పనిచేశారు. పాత్రికేయుడిగా రాణించిన కృష్ణంరాజు ఆ వృత్తికి గుడ్బై చెప్పి సినీ అవకాశాల కోసం 23 ఏళ్ల వయసులో హైదరాబాద్ నుంచి మద్రాస్కు పయనమయ్యారు.
వరుస విజయాలతో తారపథంలోకి..
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం’ చిత్ర విజయం హీరోగా, నిర్మాతగా కృష్ణంరాజుకు సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చింది. అప్పటివరకు రెబల్స్టార్ అనే ఇమేజ్ ఛట్రంలో బందీ అయిన ఆయన్ని ఓ సాత్విక పాత్రలో ఆవిష్కరించిందా చిత్రం. ఇక 1978 సంవత్సరాన్ని కృష్ణంరాజు కెరీర్లో స్వర్ణయుగంగా చెబుతారు. ‘కటకటాల రుద్రయ్య’, ‘మనవూరి పాండవులు’ చిత్రాలు వారం వ్యవధిలో విడుదలై సిల్వర్జూబ్లీ హిట్స్గా నిలిచాయి.
మిగిలిపోయిన కలలు..
రెబల్ స్టార్ జీవితంలో కొన్ని తీరని కలలున్నాయి. తన కెరీర్ను మలుపుతిప్పిన ‘భక్తకన్నప్ప’ చిత్రాన్ని ప్రభాస్తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు ఎంతో ప్రయత్నించారు. స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తానని అనేక సందర్భాల్లో చెప్పారు. హీరోగా ప్రభాస్ కెరీర్ ఊపందుకోవడం, పాన్ ఇండియా తారగా పేరు తెచ్చుకోవడంతో ‘భక్త కన్నప్ప’ రీమేక్ కార్యరూపం దాల్చలేదు. ‘ఒక్క అడుగు’ పేరుతో కృష్ణంరాజు సొంతంగా ఓ కథ తయారుచేసుకున్నారు. ఆ సినిమాలో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ శక్తివంతమైన పాత్రను డిజైన్ చేశారు. ఆ సినిమా కేవలం ప్రకటన వరకు మాత్రమే పరిమితమై పోయింది. ‘విశాల నేత్రాలు’ నవలను సినిమాగా తీయాలనుకున్నా.. అది కూడా పట్టాలెక్కలేదు. అన్నింటికంటే ముఖ్యంగా నట వారసుడు ప్రభాస్ ఓ ఇంటివాడైతే చూడాలని కృష్ణంరాజు తపించి పోయేవారు. ఇంటర్వ్యూల సందర్భంగా ప్రభాస్ పెళ్లి ప్రస్తావగా రాగానే సంబరపడిపోయేవారు. ‘ప్రభాస్ ఓకే అంటే వెంటనే పెళ్లి చేసేస్తాం.. వాడి పెళ్లి చూడటానికి మించి ఆనందం ఇంకేం ఉంటుంది’ అని చెప్పేవారు.
ప్రజా జీవిత ప్రస్థానం
కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితాన్ని ప్రారంభించారు కృష్ణంరాజు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు అందులో చేరారు. 1998 ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి గెపొంది వాజ్పేయి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2004లో నర్సాపురం నుంచి ఓడిపోయారు. భాజపాను వీడి 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. అనతి కాలంలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చారు.
వైద్యులు ఏమన్నారంటే ?
అనారోగ్య సమస్యలతో గత నెల 5వ తేదీన కృష్ణంరాజు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మధుమేహం, గుండె సంబంధ వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల సమస్య ఉన్నాయి. గుండె, కిడ్నీ పనితీరులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరగక గతేడాది కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు తీవ్రమయ్యాయి. మందులను తట్టుకునే బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్రమైన న్యూమోనియా వచ్చింది. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించాం. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
ఆప్త మిత్రుడిని కోల్పోయా
కృష్ణంరాజు నాకు ఆప్త మిత్రుడు. తన యాభై ఏండ్ల సినీ ప్రయాణంలో విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. లోక్సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు సేవలందించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తాం.
– సీఎం కేసీఆర్
వేదనకు గురయ్యాం
కృష్ణంరాజు గారు తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన మృతి చెందారని తెలియగానే ఎంతో వేదనకు గురయ్యాం. కృష్ణంరాజు గారు అజాతశత్రువు, వివాద రహితుడు, సౌమ్యుడు. నిగర్వి. పెద్దలు, పిన్నలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో గౌరవంగా ఉంటారు. ఆయన గౌరవానికి, గొప్పదనానికి తగినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం గారు ఆదేశించారు. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు గుండె నిబ్బరంతో ఉండాలని కోరుకుంటున్నా.
– మంత్రి కేటీఆర్
షాక్కు గురయ్యా
మనల్ని ఇంత త్వరగా కృష్ణంరాజు గారు వదిలేసి వెళ్లిపోవడం షాక్కు గురి చేసింది. ప్రభాస్తో పాటు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన మరణం కుటుంబ సభ్యులైన మీతో పాటు అశేష ప్రేక్షకాభిమానులకు తీరని లోటు.
– ఎంపీ సంతోష్కుమార్
50 ఏళ్ల స్నేహం మాది
కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. 50 ఏళ్ల స్నేహం మాది. మా కాంబినేషన్లో వచ్చిన ‘ఇంద్రభవనం’, ‘అడవి సింహాలు’, ‘యుద్దం’ వంటి ఎన్నో చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఆయన ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం.
– హీరో కృష్ణ