కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కబ్జా’. ఆర్.చంద్రు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ తన సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై తెలుగులో విడుదల చేస్తున్నారు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం హైదరాబాద్లో టై టిల్ సాంగ్ను విడుదల చే శారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ‘కరోనా లాక్డౌన్ సమయంలో ఈ సినిమాను మొదలుపెట్టాం. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ధైర్యంగా పూర్తి చేశాం. పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలనే పట్టుదలతో నిర్మాత చాలా కష్టపడ్డారు. మార్చి 17న కేవలం ఇండియానే కాదు గ్లోబ్ను కబ్జా చేయబోతున్నాం (నవ్వుతూ)’ అని అన్నారు.
దర్శకుడు చంద్రు మాట్లాడుతూ ‘నా కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. నిజాయితీగా పనిచేస్తే ఎప్పటికైనా ఫలితం వస్తుందనే ఉపేంద్రగారి మాటల్ని నేను విశ్వసిస్తాను. కన్నడంలో ‘కేజీఎఫ్’ నన్ను బాగా ప్రభావితం చేసింది. ఓటీటీల వల్ల నేటి ప్రేక్షకులు గ్లోబల్ మూవీస్ చూస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని వినూత్నమైన కథను సిద్ధం చేశా. టీమ్ అందరి సమిష్టి కృషితో సినిమా గొప్పగా వచ్చింది. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. చంద్రబోస్ అద్భుతమైన ఓ గీతాన్ని అందించారు’ అని తెలిపారు. శ్రియ సరన్ మాట్లాడుతూ ‘దర్శకుడు కథ చెప్పినప్పుడే అద్భుతంగా ఉందనిపించింది. ఉపేంద్ర వంటి సీనియర్ నటుడితో తెరను పంచుకోవడం కొత్త అనుభూతినిచ్చింది’ అని పేర్కొంది. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘ఉపేంద్రగారితో ఓ ఫొటో దిగితే చాలనుకునేవాడిని. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ని’ అని పేర్కొన్నారు.