ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో డిజిటల్ అరంగేట్రం చేసింది సమంత అక్కినేని. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే అభిమానులు తేల్చేశారు. దీనిపై తాజాగా ఇన్స్టాగ్రామ్లో సామ్ స్పందించింది. ఈ పాజిటివ్ రీవ్యూలు చూస్తుంటే తనకు పట్టలేని ఆనందం కలుగుతోందని ఆమె కామెంట్ చేసింది. తెలుగువాళ్లు రాజ్ నిడమోరు, కృష్ణ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్లో సమంత.. శ్రీలంకన్ తమిళ లిబరేషన్ ఫైటర్ రాజీగా కనిపించింది. ఇది పూర్తిగా డీగ్లామరస్ రోల్. ఈ రాజీ క్యారెక్టర్ తనకు ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా సమంత చెప్పింది.
బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయీతో పోటీ పడి నటించింది సమంత. విద్వేషం, అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తిన పాత్రలో సమంత నటన అద్భుతమని ఫ్యాన్స్ ఆకాశానికెత్తారు. ఈలం యుద్ధంలో మహిళల పాత్ర, శ్రీలంకలో తమిళుల పోరాటానికి సంబంధించిన డాక్యుమెంటరీలు తాను చూశానని, కొన్ని దశాబ్దాలుగా శ్రీలంక తమిళులు పడిన బాధలు తనను కలచివేశాయని తన పోస్ట్లో సమంత చెప్పింది. ఆ యుద్ధం తాలూకు చేదు జ్ఞాపకాలతో ఇప్పటికీ జీవిస్తున్న వారికి రాజీ స్టోరీ ఓ నివాళి అని ఆమె కామెంట్ చేసింది.