‘ఇది కేవలం స్పోర్ట్స్ సినిమానే కాదు. ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. నన్ను హీరోగా ఎంతగానో ఆదరించారు. నిర్మాతగా కూడా మద్దతునివ్వండి’ అని అన్నారు హీరో రవితేజ. ఆయన నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్వర్క్స్, విష్ణువిశాల్ స్టూడియోస్తో కలిసి తెరకెక్కించిన చిత్రం ‘మట్టి కుస్తీ’. విశాల్, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించారు. డిసెంబర్ 2న విడుదల కానుంది.
ఆదివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ ‘ స్పోర్ట్స్, ఫ్యామిలీ అంశాలు మేళవించిన ఈ కథ తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నారు. ‘రవితేజగారు మంచి మనసున్న వ్యక్తి. ఆయన మద్దతుతో మీ ముందుకొస్తున్నా. నా సతీమణి జ్వాలా గుత్తా నేను తెలుగు సినిమాలు చేయాలని చెబుతుంటుంది.
స్త్రీపురుషులు సమానమనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తీశాం. మహిళలందరూ ఈ కథను ఇష్టపడతారు’ అని విష్ణువిశాల్ తెలిపారు. వాణిజ్య అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు చెల్లా అయ్యావు చెప్పారు. విష్ణువిశాల్ను తెలుగు సినిమా చేయమని మూడేళ్లుగా అడుగుతున్నానని, కథాపరంగా విభిన్నమైన చిత్రమిదని జ్వాలా గుత్తా పేర్కొంది.