Ravi Babu |తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక శైలి కలిగిన దర్శకుడు రవిబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. తక్కువ బడ్జెట్తో టెక్నికల్గా మంచి సినిమాలు తెరకెక్కించడంలో పేరొందిన ఆయన, ‘అనసూయ’, ‘అవును’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘రేజర్’ మే 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిబాబు, టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ప్రీమియర్ షోల టికెట్ ధరలపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా స్టార్ హీరోల వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.
వేదికలపై అభిమానులపై ప్రేమను వ్యక్తం చేసే హీరోలు, సినిమా విడుదల రోజున అదే అభిమానులకి అధిక టికెట్ ధరలు విధించడం సరైనదా అని ప్రశ్నించారు. అభిమానులంటే నిజంగా ప్రేమ ఉంటే, వాళ్లకోసం ప్రత్యేకంగా ఫ్రీ షోలు వేయాలి. మొదటి రోజు సినిమాకు వచ్చే వారు నిజమైన ఫ్యాన్స్. అలాంటి వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయడం సరైంది కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రవిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ అంశంపై పరిశ్రమలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు నిర్మాతలు, భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి రోజే పెట్టుబడులు తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచడం తప్పదని చెబుతున్నారు. అభిమానులు కూడా తమ ఇష్టమైన హీరో సినిమాను ముందుగా చూడటానికి ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటే దాంట్లో తప్పేముందని వారు అంటున్నారు.
ఇంకోవైపు విమర్శకులు మాత్రం ఈ విధానం సామాన్య ప్రేక్షకుడికి భారమవుతుందని, అలాగే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. అదనంగా, అధిక అంచనాలు ఏర్పడి సినిమా తేడా కొడితే నెగటివ్ టాక్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ‘రేజర్’ విడుదలకు ముందు రవిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో టికెట్ ధరలపై ఉన్న వ్యాపార ధోరణిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.