కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ ముద్దుగుమ్మ భారీ అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నది. తాజాగా ఈ భామ తెలుగులో మరో బంపరాఫర్ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో తొలుత బాలీవుడ్ తార అలియాభట్ను నాయికగా ఖరారు చేశారని వార్తలొచ్చాయి.
అయితే ఇటీవలే ఆమె రణబీర్కపూర్తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కొద్ది మాసాల పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకోవడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నదని తెలిసింది. ఆ స్థానంలో రష్మిక మందన్నను కథానాయికగా తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’, ‘సీతారామం’ చిత్రాల్లో నటిస్తున్నది. తమిళ విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కూడా రష్మిక కథానాయికగా ఖరారైన విషయం తెలిసిందే.