Mysaa Movie | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైసా. ఈ చిత్రంలో రష్మిక ఒక శక్తివంతమైన గోండు గిరిజన యువతిగా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం ఆమె తన నటనలోనే కాకుండా శారీరక శ్రమలోనూ కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్రలో రాణించేందుకు రష్మిక ఇటీవలే బ్యాంకాక్ వెళ్లి ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో కఠినమైన యుద్ధ విద్యలు, ప్రత్యేక స్టంట్స్లో శిక్షణ పొందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో సుమారు 15 రోజుల పాటు సాగే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరిస్తోంది. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక చేసే విన్యాసాలు, పోరాట ఘట్టాలు సినిమాకే హైలైట్గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, అత్యంత గాఢతతో కూడిన ఈ గిరిజన యువతి పాత్రలో రష్మిక నటన సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.