కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెర దృశ్యమానం కాబోతున్న విషయం తెలిసిందే. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటించనుంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 16న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జయంతిని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. అదే రోజు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక మందన్న ప్రత్యేక శిక్షణ తీసుకోనుందని తెలిసింది.
దిగ్గజ కళాకారిణిగా కీర్తిగడించిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్ర చిత్రణ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రతి అంశంలో ప్రామాణికతను పాటిస్తూ చిత్రాన్ని తెరకెక్కించాలన్నది దర్శకనిర్మాతల సంకల్పమని అంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సంగీత కళాకారిణిలతో కలిసి స్పెషల్ వర్క్షాప్ను కూడా నిర్వహించబోతున్నారని సమాచారం. ఈ శిక్షణ తర్వాతే రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టే యోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. తెలుగులో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వివిధ భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు.