‘మైసా’ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ధైర్యసాహసాలు మూర్తీభవించిన గిరిజన మహిళగా ఆమె కనిపించనున్న విషయం తెలిసిందే. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోరాట ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమా కోసం బ్యాంకాక్లో మార్షల్ ఆర్ట్స్లో ట్రెయినింగ్ తీసుకుంది రష్మిక మందన్న. డూప్లేకుండా స్వయంగా పోరాట ఘట్టాల్లో పాల్గొన్నది. తాజాగా ఆమె భారతీయ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ చేయని ఓ అరుదైన ఫీట్ని సొంతం చేసుకుంది. ‘మైసా’ కోసం రెండు రోజుల్లో దాదాపు 20 గంటల పాటు అత్యంత క్లిష్టమైన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ను చిత్రీకరించారు.
వీటిలో డూప్ లేకుండా రష్మిక స్వయంగా పాల్గొన్నది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కథానాయిక సొంతంగా చేసిన తొలి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్ ఇదే కావడం విశేషం. సన్నివేశాల్లో సహజత్వం కోసం రష్మిక స్వయంగా అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ చేసిందని, సినిమా పట్ల ఆమె అంకితభావానికి ఇదొక నిదర్శనమని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలో ఈ సినిమా టీజర్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: అన్ఫార్ములా ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: రవీంద్ర పుల్లె.