ఇటీవల ‘వారసుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రష్మిక మందన్న. తమిళంలో ఈ సినిమా ‘వరిసు’ పేరుతో విడుదలైంది. ఆమె గత చిత్రాలన్నీ అందంతో పాటు నటనకు పేరు తీసుకురాగా..ఈ చిత్రంలో రష్మిక పర్మార్మెన్స్కు పెద్దగా స్కోప్ లేకుండా పోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. కేవలం హీరో సరసన ఆడిపాడి ఆకట్టుకుందీ నాయిక. కథలో తనకు కీలకమైన పాత్ర లేదని ముందే తెలిసినా…విజయ్ సరసన నటించాలనే కోరికతో ఈ సినిమాకు అంగీకరించానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రష్మిక. ఆమె మాట్లాడుతూ… ‘మాకు ప్రతిసారీ నటనకు ఆస్కారమున్న పాత్రలు లభించకపోవచ్చు.
‘వారసుడు’ కథ విన్నప్పుడే ఇందులో నేను చేసేందుకు పెద్దగా ఏం లేదని తెలుసు. విజయ్ నా అభిమాన నటుడు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా కల. అలాంటి అవకాశం వచ్చినప్పుడు నా పాత్ర గురించి ఆలోచిస్తూ ఆఫర్ వద్దనుకోవడం సరికాదు. కమర్షియల్ చిత్రాల్లో ఒక్కోసారి ఇలాంటివి తప్పవు’ అని చెప్పింది. తెలుగులో ఆమె నటిస్తున్న ‘పుష్ప 2’ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది.