సినిమాల సమాచారాన్ని బయటకు వెల్లడించే విషయంలో తాను చాలా గోప్యత పాటిస్తానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. నిర్మాతలు, చిత్రబృందం నుంచి అనుమతి తీసుకున్నాకే తాను అంగీకరించిన సినిమాల వివరాల్ని వెల్లడిస్తానని పేర్కొంది. ఇటీవలే సోషల్మీడియాలో అభిమానులతో సంభాషించిన ఈ సొగసరి ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, వాటి వివరాల్ని త్వరలో వెల్లడిస్తానని చెప్పింది. పెంపుడు శునకం ఆరా తన జీవితంలో ఓ భాగమైపోయిందని, షూటింగ్ లొకేషన్స్లో ఆరా చేసే సందడిని అందరూ ఇష్టపడతారని తెలిపింది. ‘ఆరాను షూటింగ్స్కు తీసుకెళ్తున్నా. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నేనిచ్చే సూచనల్ని ఆరా చక్కగా పాటిస్తుంది. కారవాన్ చుట్టూ తిరుగుతూ ఆరా చేసే హంగామాను చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోతారు. ఒకవేళ నాతో పాటు ఆరా లోకేషన్లో లేకపోతే ఎందుకు తీసుకురాలేదని అడుగుతుంటారు. అంతలా ప్రతి ఒక్కరి ప్రేమను దోచుకుంది ఆరా’ అంటూ తన పెంపుడు శునకం గురించి చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది.