హిందీ తన మాతృభాష అయినా తెలుగును ఎంతగానో అభిమానిస్తానని చెప్పింది పంజాబీ సుందరి రాశీఖన్నా. కాస్త బొద్దుగా కనిపిస్తూనే చూడగానే ఆకట్టుకునే ముఖారవిందం, అల్లరి..అమాయకత్వం కలబోసిన అభినయంతో ఈ భామ యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో హిందీ చిత్రసీమపై ఎక్కువగా దృష్టిపెడుతుందీ అమ్మడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘నా సినీ కెరీర్ ఓ వృత్తంలో తిరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది. హిందీలో ప్రయాణాన్ని మొదలుపెట్టి అనంతరం తెలుగులో రాణించాను. ఇప్పుడు బాలీవుడ్లో మంచి అవకాశాలొస్తున్నాయి. ఏ భాషా చిత్రాల్లో చేసినా నాకు తెలుగంటే ప్రత్యేకమైన మమకారం. నేనీ స్థాయిలో ఉండటానికి తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణే కారణం. నేను తెలుగు ఇండస్ట్రీకి చెందిన నాయికనని గర్వంగా చెబుతాను. హైదరాబాద్ను నా సొంత ఇల్లుగా భావిస్తా’ అని చెప్పుకొచ్చింది. నటన తప్ప తనకు మరో వ్యాపకం లేదని, సినిమానే జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని నేర్పించిందని రాశీఖన్నా పేర్కొంది. ఇతర కథానాయికలతో అస్సలు పోల్చుకోనని..ఎవరికివారు ప్రత్యేకమని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగులో థాంక్యూ, పక్కా కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది రాశీఖన్నా.