ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న నేపథ్యంలో ఇక్కడి సినిమాల రీమేక్లపై ఆసక్తి చూపిస్తున్నారు బాలీవుడ్ హీరోలు. ఈ ఏడాది కనీసం నాలుగైదు తెలుగు చిత్రాలు హిందీలో పునర్నిర్మాణం అయ్యాయి. ఇప్పుడు మరో టాలీవుడ్ సూపర్హిట్ మూవీ బాలీవుడ్లోకి వెళ్లనుంది. హీరో రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు రణ్వీర్ సింగ్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులకు అందిస్తే మంచి విజయాన్ని అక్కడా సాధించవచ్చనే నమ్మకంతో రణ్వీర్ సింగ్ ఈ ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. మాతృకను రూపొందించిన దర్శకుడే హిందీలోనూ రూపొందిస్తారా లేక అక్కడి నేటివిటీకి తగినట్లు బాలీవుడ్ దర్శకుడు బాధ్యతలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ‘సింబా’, ‘సూర్యవంశీ’ వంటి చిత్రాల్లో పోలీస్ అధికారి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారీ కథానాయకుడు. ఆయన నటించిన ‘సర్కస్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో పూజా హెగ్డే నాయికగా నటించింది.