వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తేనే ఆ సినిమా విజయం సాధించినట్లు కాదని, నిర్మాతకు లాభం తెచ్చే ప్రతి సినిమా సక్సెస్ అయినట్లేనని అంటున్నది బాలీవుడ్ నాయిక రాణీ ముఖర్జీ. ఇటీవల ‘మిస్టర్ అండ్ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాలో నటించిన ఈ తార…విజయాన్ని అందుకుంది. తాజా ఇంటర్వ్యూలో రాణీ ముఖర్జీ మాట్లాడుతూ…
‘కేవలం హీరోలే థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించగలరు అనే అభిప్రాయం పరిశ్రమలో ఉండేది. కానీ ఇటీవల నాయికల సినిమాలకు కూడా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తేనే విజయం సాధించినట్లు కాదు…నిర్మాత సినిమాకు పెట్టిన పెట్టుబడికి లాభం రావాలి. అసలైన విజయానికి అర్థమదే. ఇటీవల నాయిక ప్రధాన చిత్రాలకు అలాంటి లాభాలు వస్తున్నాయి’ అని చెప్పింది.