Rangasthalam | టాలీవుడ్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన రంగస్థలం సినిమా విడుదలై నేటితో 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2018 మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, రామ్ చరణ్ కెరీర్లోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది.చిరంజీవి వారసుడిగా చిరుతతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్, మగధీరతో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ‘రంగస్థలం’తో ఆయన తనలోని నటుడిని మరో స్థాయికి తీసుకెళ్లారు. స్టైలిష్ లుక్స్తో కనిపించే చరణ్ను పూర్తిగా భిన్నంగా చూపించాడు దర్శకుడు సుకుమార్. గ్రామీణ నేపథ్యంలో, చెవులు సరిగా వినిపించని ‘చిట్టిబాబు’ పాత్రలో చరణ్ నటించడం అప్పట్లో పెద్ద రిస్క్గా భావించారు. కానీ కథపై నమ్మకంతో చరణ్ తీసుకున్న నిర్ణయం భారీ విజయంగా మారింది.
సినిమాలో చరణ్ నటన ప్రేక్షకులను, విమర్శకులను సమానంగా ఆకట్టుకుంది. ఆయన చూపించిన నేచురల్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కలసి పాత్రకి ప్రాణం పోసాయి . అతని నటనకు చిరంజీవి సైతం ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించగా, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టి, అనసూయ భారద్వాజ్, రాజీవ్ కనకాల వంటి నటీనటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. తండ్రీ-కొడుకుల భావోద్వేగాలు, గ్రామీణ రాజకీయాలు, ప్రేమ కథ అన్నీ సమపాళ్లలో మిళితమై ప్రేక్షకులను కట్టిపడేశాయి. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి.
‘రంగస్థలం’ విజయంతో రామ్ చరణ్ తన నటనా వైవిధ్యాన్ని నిరూపించుకుని, తర్వాతి సినిమాల్లో మరింత ప్రయోగాలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందుతూ, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ‘రంగస్థలం’ లాంటి క్లాసిక్ సినిమాలు అరుదుగా వస్తాయి. ఎనిమిదేళ్లు పూర్తైనా ఈ చిత్రం ప్రభావం తగ్గకపోవడం, దాని గొప్పతనాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.