టోక్యో ఒలింపిక్స్లో భారత్కి స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రా రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెని 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్లో భారత్ 100 ఏళ్ల పతక నిరీక్షణకి తెరదించిన విషయం తెలిసిందే. ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ పెరిగారు. టీవీ ఛానెల్స్ ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకునేందుకు పోటీ పడ్డాయి.
ఓ ఇంటర్వ్యూలో అతని బయోపిక్ గురించి చర్చ వచ్చింది. దాంతో అతను స్పందిస్తూ ‘‘నా బయోపిక్కి అప్పుడే తొందరేమీ లేదు. నేను సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దేశానికి కీర్తి తెస్తూ.. అథ్లెట్గా రాణించాలనుకుంటున్నా. నేను రిటైర్మెంట్ తీసుకున్నాక బయోపిక్ తీస్తే బెటర్. అప్పుడు నా గురించి చాలా కథలుంటాయి’’ అని నీరజ్ చోప్రా వెల్లడించాడు. అయితే అంతక ముందు హర్యానాకి చెందిన రణదీప్ హుడా లేదా అక్షయ్ కుమార్ తన పాత్రలో నటిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
అయితే రీసెంట్గా తన అభిమాన హీరో రణ్దీప్ హుడాని పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్లో కలుసుకున్నాడు నీరజ్ చోప్రా. ఆ సమయంలో ఇద్దరు కలిసి ఫొటో దిగగా ప్రస్తుతం ఆ పిక్ వైరల్గా మారింది. నీరజ్, హూడా ఇద్దరూ హర్యానా రాష్ట్రానికే చెందిన వారే కావడం, అలాగే ఇద్దరికీ క్రీడలంటే అమితమైన ఆసక్తి ఉండడంతో వారి మధ్య స్నేహం బలపడింది. రణ్దీప్ నటించిన ‘లాల్రంగ్’ అంటే చాలా ఇష్టమని , ‘సర్బజీత్’, ‘హైవే’ తనను చాలా ఆకట్టుకున్నాయని గతంలో పేర్కొన్నాడు నీరజ్.