Virat Kohli Biopic | చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. భారత జట్టు విజయంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఇక ఈ మ్యాచ్లో రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతో సచిన్ 49 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. అయితే కోహ్లీ 50 శతకాల రికార్డు తర్వాత.. అతడి బయోపిక్ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. కోహ్లీ బయోపిక్లో ఎవరు నటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) తాజాగా స్పందించాడు.
ముంబయిలో జరిగిన సెమీఫైనల్ పోరుకు రణ్బీర్ హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. రణ్బీర్ తాజాగా నటిస్తున్న సినిమా ‘యానిమల్’. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మ్యాచ్కు వచ్చిన రణ్బీర్.. కోహ్లీ బయోపిక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లీ బయోపిక్లో మీరు నటించాలనుకొంటున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రణ్బీర్ సమాధానమిస్తూ.. కోహ్లీ బయోపిక్ సినిమాగా తీస్తే.. అందులో అతడే నటించాలి. ఎందుకంటే అతడు ఇండియాలో ఉన్న చాలా మంది నటులకంటే అందంగా, ఫిట్గా ఉంటాడు. అందుకే ఆ రోల్ను కోహ్లీనే పోషించాలి అని రణ్బీర్ తెలిపాడు. కాగా రణ్బీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.