Ranbir kapoor | ప్రేక్షకులకు ఏ తరహా సినిమాలు అందించాలనే విషయంలో హిందీ చిత్ర పరిశ్రమ అయోమయంలో పడిందని అంటున్నారు బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్. వెస్ట్రన్ సినిమా ప్రభావానికి లోనుకావడమే ఇందుకు కారణంగా ఆయన అభిప్రాయపడ్డారు. రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ…‘బహుశా గత ఇరవై ఏండ్లుగా హిందీ చిత్ర పరిశ్రమ ఫిలిం మేకింగ్లో కన్ఫ్యూజ్ అవుతున్నది. ఏ తరహా సినిమాలతో విజయాలు సాధించవచ్చనే విషయంలో స్పష్టత కోల్పోతున్నది. ఆంగ్ల చిత్రాలను రీమేక్ చేయడం, వాటి స్ఫూర్తితో ఫ్రీమేక్లు చేస్తూ మనదైన సినిమాను వదిలేశారు.
దీంతో మన ప్రేక్షకులకు ఏ సినిమా ఇష్టమో అవి మర్చిపోయాం. కొద్ది మంది నటీనటులైతే కొత్త దర్శకులకు ఏమాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. కొత్త వాళ్లను ప్రోత్సహించాలి. అప్పుడే వైవిధ్యమైన చిత్రాలు తెరపైకి వస్తాయి’ అన్నారు. ఇటీవల ‘తూ జూతీ మై మక్కర్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు రణ్బీర్ కపూర్. ప్రస్తుతం ఆయన ఖాతాలో ‘యానిమల్’ సినిమా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది.