Rana Daggubati | ఒకటి రెండు ఫ్లాపుల తర్వాత ఆ దర్శకుడిని పట్టించుకోవడం మానేస్తారు హీరోలు. అలాంటిది కొన్ని సంవత్సరాలుగా వరుస పరాజయాలు ఇస్తుంటే ఆయన గురించి ఆలోచించడం కూడా వృథా అనుకుంటారు నిర్మాతలు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా అవకాశాలు మాత్రం అందుకుంటూనే ఉంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా కొందరు దర్శకులను ఒక కాంపౌండ్ హీరోలు బాగా నమ్ముతుంటారు. ప్రస్తుతం తేజను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఈయనకు సరైన విజయం లేదు. నేనే రాజు నేనే మంత్రి మినహాయిస్తే గత 20 సంవత్సరాలలో తేజ సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు.
అప్పుడెప్పుడో చిత్రం, నువ్వు నేను, జయం అంటూ వరుస విజయాలు అందుకున్న ఈయన.. ఆ తర్వాత పూర్తిగా రేసులో వెనుకబడిపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన నిజం, జై, ధైర్యం లాంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తేజను లైట్ తీసుకున్నారు హీరోలు. ఆ తర్వాత కూడా కొత్త వాళ్లతో సినిమాలు చేశాడు కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇలాంటి సమయంలో 2017లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మంచి విజయం సాధించింది. రానా హీరోగా వచ్చిన ఈ సినిమాతో తేజ మరోసారి ఫామ్లోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆయన నుంచి వచ్చిన సీత, అహింస లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అహింస అయితే ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా తెలియదు.
#RakshasaRaja Begins 🔥🔥 pic.twitter.com/CeabZPCejE
— Rana Daggubati (@RanaDaggubati) December 14, 2023
ఇలాంటి సమయంలో తేజతో సినిమా అంటే తెలిసి తెలిసి రిస్క్ చేయడమే. అయినా కూడా రానా ఆయనను మరోసారి నమ్మాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాక్షస రాజా అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. డిసెంబర్ 14న తన పుట్టినరోజు సందర్భంగా తేజ సినిమా కన్ఫర్మ్ చేశాడు ఈ హీరో. రానా దగ్గుబాటి మూడు నాలుగు సంవత్సరాలుగా బాగా స్లో అయ్యాడు. అదేంటి అని అడిగితే మొదట్లో గుర్తింపు కోసం వరుస సినిమాలు చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు ఆ అవసరం లేదని అంటున్నాడు తనెంటో ప్రపంచం మొత్తం చూసిన తర్వాత తన నుంచి వచ్చే సినిమాలు సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి.. అందుకే టైం తీసుకుంటున్నాను అంటున్నాడు రానా. మొత్తానికి తేజను మాత్రం మరోసారి బాగానే నమ్మాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ దర్శకుడు ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.