గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటిస్తున్న సినిమా ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 5న విడుదలకు సిద్ధమవుతున్నది.
చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆయన మాట్లాడుతూ…‘గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ అనే ఇంట్రెస్ట్తోనే ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ప్రొడక్షన్ నుంచి మా పూర్తి సహకారం అందించాం. శ్రీవాస్ కథ చెప్పినప్పుడు ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందనిపించింది. అన్నాదమ్ముల మధ్య అనుబంధంతో పాటు యాక్షన్, సెంటిమెంట్, కుటుంబ భావోద్వేగాలతో సాగుతుంది. ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించితే ఏ తరహా సినిమా అయినా విజయం సాధిస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అన్ని రకాల చిత్రాలు చేయాలన్నది మా ఆలోచన. ఈ చిత్రంతో మరో మంచి ప్రయత్నం చేశామని చెప్పగలను. అన్నాదమ్ముల కథ కాబట్టి రామబాణం అనే టైటిల్ బాగుంటుందని అనిపించింది. నిర్మాణ సంస్థ ప్రారంభించే ముందే ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి… ఫ్యాక్టరీ మోడల్లో ప్రొడక్షన్ ప్రారంభించాం.
ఎక్కువ సంఖ్యలో సినిమాలను నిర్మిస్తూ ఒక సినిమా ఆడకున్నా, మరో సినిమా విజయం సాధిస్తుందనే ఫార్ములాతో ముందుకు వెళ్తున్నాం. ఇతర వ్యాపారాలు ఉన్నా సినిమా మీద ఆసక్తి ఉండేది. ఓటీటీ, డిజిటల్ హక్కులు నిర్మాతకు కలిసివస్తున్నాయి. సినిమా నిర్మాణ వ్యయం నుంచి సగం వరకు వీటి నుంచే రికవరీ అవుతున్నది. ప్రభాస్తో నిర్మిస్తున్న సినిమా గురించి త్వరలో వివరాలు వెల్లడిస్తాం. అవకాశం వస్తే అల్లు అర్జున్, చిరంజీవితోనూ సినిమాలు నిర్మిస్తాం.’ అన్నారు.