Double Ismart | పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అప్పటివరకు ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న రామ్-పూరి జగన్నాథ్ల కెరీర్లో కొత్త జోష్ను నింపింది. ఈ బ్లాక్బస్టర్ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
హీరో రామ్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఛార్మి క్లాప్నిచ్చారు. తొలి సన్నివేశానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ‘ఇస్మార్ట్ శంకర్ ఆలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అంటూ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.